కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ
  • పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించామని వెల్లడి
  • కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి నీచ రాజకీయం వల్ల చట్టం అమల్లోకి రాలేదని విమర్శ
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని తెలిపారు.

కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయం వల్లే ఆ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని విమర్శించారు. మహిళలు అభివృద్ధి చెందడం, అసెంబ్లీ, పార్లమెంటులకు రావడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. అందుకే నాలుగు దశాబ్దాలుగా ఈ బిల్లును అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడమే కాకుండా, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు.

లోక్ సభ, శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడమనే మహాయజ్ఞం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నామని ఆయన అన్నారు. మాతృమూర్తుల ఆశీస్సులు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని, సాధారణ మహిళలు పార్లమెంటుకు, అసెంబ్లీకి రావడానికి తెచ్చిందని అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మహిళలు కేవలం కుటుంబాలకే పరిమితం కావాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు.

PM Modi blames Opposition for stalling women reservation Bill
PM Modi on Women Reservation Bill

More Telugu News